ఏపీలో స్పోర్ట్స్ సిటీ, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం నిర్మాణం – కీలక ప్రణాళికలు
ఏపీని క్రీడా రాజధానిగా తీర్చిదిద్దే దిశగా అడుగులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని అన్ని రంగాల్లో వేగవంతం చేస్తోంది. ప్రత్యేకించి క్రీడా రంగాన్ని ప్రోత్సహించేందుకు పెద్ద ఎత్తున ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా స్పోర్ట్స్ సిటీ మరియు అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మించేందుకు నిర్ణయం తీసుకుంది.
అమరావతిలోనే స్పోర్ట్స్ సిటీ నిర్మాణం
రాష్ట్ర రాజధాని అమరావతిలో ప్రపంచ స్థాయి మౌలిక వసతులతో కూడిన స్పోర్ట్స్ సిటీ నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఇటీవల వెల్లడించిన వివరాల ప్రకారం, కృష్ణా నదీ తీరంలో సుమారు 2 వేల ఎకరాల భూమిలో స్పోర్ట్స్ సిటీ నిర్మించనున్నారు. ఇప్పటికే మైలవరం నియోజకవర్గంలోని కృష్ణ లంక ప్రాంతాన్ని పరిశీలించారు.
ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం పై ACA కార్యాచరణ
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ACA) అధ్యక్షుడు మరియు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ఇటీవల కీలక ప్రకటన చేశారు. మూలపాడు ACA ఇంటర్నేషనల్ క్రికెట్ కాంప్లెక్స్ వద్ద జర్నలిస్ట్ క్రికెట్ లీగ్ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ, “ఏపీని క్రీడాంధ్రగా మారుస్తాం. అమరావతిని దేశ క్రీడా రాజధానిగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు చేస్తున్నాం” అని తెలిపారు.
దేశంలోనే అతిపెద్ద స్టేడియం లక్ష్యంగా
ACA ఇప్పటికే దేశంలోనే అతిపెద్ద అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మించాలని భావిస్తోంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాలను పరిశీలించి నివేదికలు సిద్ధం చేస్తున్నారు. అమరావతిలో ఏర్పాటు చేయబోయే ఈ స్టేడియం నూతన యవతకు ప్రోత్సాహకంగా మారనుంది.
అభివృద్ధితో పాటు ఉపాధి అవకాశాలు
ఈ స్పోర్ట్స్ సిటీ, స్టేడియం నిర్మాణాల వల్ల స్థానిక అభివృద్ధితో పాటు ఉపాధి అవకాశాలు, క్రీడా పరిశ్రమలో వృద్ధి జరుగనుంది. హోటల్స్, ట్రాన్స్పోర్ట్, టూరిజం రంగాలన్నీ దీని ద్వారా మెరుగుపడతాయి.