నారాయణవనం మండలంలోని పాతూరులో వ్యర్థాల తరలింపు విషయంలో తీవ్ర కలకలం చోటు చేసుకుంది.
గ్రామ పరిసరాలలో స్పార్సన్టెక్ అనే ప్రైవేట్ ప్రాసెసింగ్ కంపెనీ కార్యకలాపాలు కొనసాగుతోంది. అయితే ఈ కంపెనీ నుంచి విడుదలవుతున్న ద్రవ వ్యర్థాలను ట్యాంకర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న తీరుపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే కొన్ని రోజులుగా గ్రామ సమీప ప్రాంతాల్లో ట్యాంకర్లు తరచూ రావడం, వ్యర్థాలను రహస్యంగా తరలించడంపై స్థానిక యువకులు, రైతులు శంకిస్తుండగా, తాజాగా సేకరించిన దృశ్యాలు మరియు దృవాల ఆధారంగా కంపెనీ తరలిస్తున్న వ్యర్థ జలాలు కాలుష్య నియంత్రణ మండలి (PCB) నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ విషయంలో పాతూరులోని గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదులు చేశారు. ట్యాంకర్ల ద్వారా తరలిస్తున్న వ్యర్థ జలాల గమ్యం ఏంటన్నదిపై స్పష్టత లేకపోవడం, వీటి శుద్ధి లేకుండానే వదిలేస్తున్నట్టుగా అనుమానాలు వ్యక్తమవుతుండడం స్థానికులకు భయాందోళనకు గురిచేస్తోంది. కొన్ని చోట్ల ఈ వ్యర్థాల వాసన తీవ్రంగా ఉంటుండటం, పొలాల పక్కన గుండా ఈ వ్యర్థాలు చేరుతున్నట్టు రైతులు చెబుతున్నారు.
కంపెనీ నుంచి విడుదలవుతున్న వ్యర్థాలు భూగర్భ జలాలకు ప్రమాదం కలిగించే అవకాశముందని స్థానిక పర్యావరణ కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. కాలుష్య నియంత్రణ మండలి సంబంధిత ప్రాంతానికి వచ్చి పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ వ్యవహారంపై తక్షణమే విచారణ చేపట్టి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు పిలుపు నిచ్చారు. ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వారు స్పష్టం చేస్తున్నారు.