విదేశాలకు వెళ్లిన సమయంలో ఇంట్లో చోరీ – తిరుపతిలో రిటైర్డ్ ఉద్యోగి ఇంటి వద్ద మళ్లీ దొంగతనం
ఇటీవల సైబర్ మోసానికి గురైన తిరుపతి రిటైర్డ్ ఉద్యోగి వెంకటరమణబాబు, లక్ష్మీకుమారి దంపతులు మరోసారి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. ఈ దంపతులు ఇటీవల విదేశాలకు వెళ్లిన సమయంలో, ఇంట్లో చోరీ జరిగింది. తిరిగి వచ్చినప్పుడు వారి బీరువాలో ఉన్న 50 గ్రాముల బంగారు ఆభరణాలు, 500 గ్రాముల వెండి వస్తువులు కనిపించలేదు. అనంతరం సీసీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలించగా ఇద్దరు అనుమానితులు ఇంట్లోకి ప్రవేశించి చోరీ చేసినట్లు గుర్తించారు. ఈ మేరకు బాధితులు తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. ఇదివరకు ఈ దంపతులు సైబర్ మోసగాళ్లకు రూ.32 లక్షలు కోల్పోయిన విషయం తెలిసిందే. కేవలం కొన్ని రోజుల్లో రెండు ఘోర సంఘటనలు జరగడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది.
