కోలీవుడ్ స్టార్ ధనుష్ తాజా చిత్రం ‘కుబేర’ త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో లాంచ్ ఈవెంట్ చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధనుష్, తన స్పీచ్ ద్వారా నెగెటివిటీ చెలామణీ చేస్తున్న వారి మీద ఊహించని కౌంటర్లు వేశారు. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
ధనుష్ మాట్లాడుతూ, “మీరు ఎంత నెగెటివిటీ క్రియేట్ చేసినా నన్ను ఏం చేయలేరు. నా అభిమానులు నా వెనుక ఉన్నారు. మీరు ఒక్క ఇటుక కూడా కదల్చలేరు. పక్కకి వెళ్లి సర్కస్ ఫీట్లు ఆపండి.” అంటూ ఘాటుగా స్పందించారు. ఈ వ్యాఖ్యలు నయనతార బ్యాచ్, శివకార్తికేయన్ గ్రూప్కి టార్గెట్ అయి ఉండవచ్చని నెటిజన్లు విశ్లేషిస్తున్నారు.
ధనుష్ భావోద్వేగంతో మాట్లాడుతూ, “చీకట్లో దారి తెలియక నడిచే సమయంలో ఓ అదృష్ట శక్తి మన చేతిని పట్టుకుని నడిపిస్తుందని అంటారు. నా జీవితంలో ఆ శక్తి నా అభిమానులు. వారు నా కుటుంబ సభ్యుల్లా 23 ఏళ్లుగా నన్ను నడిపిస్తున్నారు. అలాంటి బలమైన అండ ఉన్నపుడు మీ నెగెటివిటీ పని చేయదు,” అని స్పష్టం చేశారు.
ఈ ఈవెంట్లో దర్శకుడు శేఖర్ కమ్ముల కూడా ధనుష్ పై ప్రశంసలు కురిపించారు. “ధనుష్ ఈ సినిమాతో మళ్లీ జాతీయ అవార్డు గెలుస్తాడు” అని ధైర్యంగా ప్రకటించారు. ఇక నాగార్జున మాట్లాడుతూ, ధనుష్ మల్టీ టాలెంటెడ్ అని, అతనితో మళ్లీ పని చేయాలని ఉందని తెలిపారు.
ఈ సందర్భంగా విడుదలైన ధనుష్ లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఆయన మాటలు అభిమానులను భావోద్వేగానికి గురిచేయగా, హెయిటర్స్కు గట్టి బదులుగా నిలిచాయి. ‘కుబేర’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ వ్యాఖ్యలతో పాటు ప్రచారం మరింత వేగం పుంజుకుంటోంది. జూన్ 20న సినిమా విడుదల కానుండటంతో, ఈ స్పీచ్ సినిమాపై హైప్ను పెంచింది.